నీట్ యూజీ కౌన్సెలింగ్–2026లో విద్యార్థులు ప్రతి రౌండ్లో కేటాయించిన కాలేజీకి వెళ్లాల్సిన అవసరాన్ని తగ్గిస్తూ ఒక్కసారి భౌతిక హాజరు విధానాన్ని అమలు చేయనున్నారు. సీట్ల కేటాయింపు అనంతరం అభ్యర్థులు ఫ్రీజ్ లేదా ఫ్లోట్ ఎంపికను ఆన్లైన్లో నమోదు చేయాలి.
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా జూలై 29న ఎంసీసీ కౌన్సెలింగ్ ఏర్పాట్లను సమీక్షించారు. సాంకేతిక మౌలిక వసతులు, సైబర్ భద్రత, ఫిర్యాదుల పరిష్కారం, కాలేజీలతో సమన్వయం, విద్యార్థులకు సహాయక చర్యలను పరిశీలించిన అనంతరం కొత్త సంస్కరణల వివరాలను కేంద్రం ప్రకటించింది.
కేటాయించిన సీటును ఖరారు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫ్రీజ్ ఎంపికను ఎంచుకోవాలి. వీరు నిర్ణీత గడువులో సంబంధిత కాలేజీకి వెళ్లి అసలు ధ్రువపత్రాలను సమర్పించాలి. కాలేజీ అధికారులు పత్రాలను పరిశీలించిన తర్వాత ప్రవేశ రుసుము చెల్లించి మిగిలిన ప్రక్రియను పూర్తి చేయాలి.
ఒక్కసారి భౌతిక హాజరు విధానం అంటే ఫ్రీజ్ అభ్యర్థులు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదని కాదు. వారు సీటును ఖరారు చేసిన వెంటనే భౌతికంగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ అంశాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే ప్రవేశ గడువు దాటిపోయే ప్రమాదం ఉంది.
కేటాయించిన సీటును కొనసాగిస్తూ మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్లలో పాల్గొనాలనుకునే అభ్యర్థులు ఫ్లోట్ ఎంపిక చేసుకోవచ్చు. వీరు పత్రాల పరిశీలన, తాత్కాలిక ప్రవేశ ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు.
ఈ సమయంలో కాలేజీకి వెళ్లడం, అసలు పత్రాలను సమర్పించడం, ప్రవేశ రుసుము చెల్లించడం అవసరం లేదు. అభ్యర్థి తాత్కాలిక ప్రవేశం కొనసాగుతూనే అప్గ్రేడేషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. ఈ అవకాశం మూడో రౌండ్ వరకు మాత్రమే ఉంటుంది.
మూడో రౌండ్ ముగిసిన తర్వాత సీటు కలిగిన అభ్యర్థులు సంబంధిత కాలేజీలో భౌతికంగా హాజరై అసలు పత్రాల పరిశీలన, ఫీజు చెల్లింపు, ఇతర ప్రవేశ ప్రక్రియలను పూర్తి చేయాలి. దీంతో పదేపదే ప్రయాణాలు, పత్రాల సమర్పణ, ఫీజు చెల్లింపు వంటి సమస్యలను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.
నీట్ యూజీ కౌన్సెలింగ్లో కొత్త విధానం.. ఒక్కసారే కాలేజీకి వెళ్లే అవకాశం
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan