మార్కాపురం ప్రజలకు కృష్ణా జలాలతో స్వాగతం పలుకుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కరవు, ఫ్లోరైడ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతానికి కృష్ణమ్మను తీసుకొచ్చామని, కరవును తరిమికొట్టామని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు జలసిరులు రావడంతో అభివృద్ధికి కొత్త ఊపొస్తుందని అన్నారు. వెలిగొండ నిజంగానే బంగారు కొండగా మారుతుందని సీఎం అభివర్ణించారు.
సోమవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చంద్రబాబు ప్రారంభించారు. వెలిగొండలో 53 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చని వివరించారు. 2024లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధాని మోదీ సహాయం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో ప్రాజెక్టును ప్రారంభించామని తెలిపారు. 1996లో తానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని, ఇప్పుడు ప్రారంభించి జాతికి అంకితం చేశానని గుర్తుచేశారు.
ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. వారి త్యాగాల వల్ల లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు వచ్చాయని అన్నారు. తొలి దశ పనులను రూ.7,983 కోట్లతో పూర్తి చేశామని, నిర్వాసితులకు రూ.1,071 కోట్లు అందించామని వివరించారు. అదనంగా రూ.165 కోట్లు చెల్లించామని, రూ.2 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తున్నామని చెప్పారు. 2028 నాటికి వెలిగొండ ఫేజ్-2ను పూర్తి చేస్తామని ప్రకటించారు.
పోలవరం ప్రాజెక్టును పుష్కరాలకు ముందే జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు తెలిపారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా, కావేరి నదులను అనుసంధానం చేస్తే నాలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం మరింత సుసంపన్నమవుతుందని పేర్కొన్నారు.
మార్కాపురానికి కృష్ణా జలాల స్వాగతం.. వెలిగొండను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
1
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk