హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రభుత్వ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి తెరలేపిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్రోడ్, అజామాబాద్లో తెలంగాణ ఆయిల్ఫెడ్కు చెందిన సుమారు రూ.500 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కేవలం రూ.87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై సీఎం రేవంత్రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు.
దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విలువైన ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదని ఆయన విమర్శించారు. ఆయిల్ఫెడ్ సంస్థ రూ.87 కోట్ల మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ఆ సంస్థను కాదని ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపుతోందని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెన్సీలా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
1987లో సుప్రీంకోర్టు ప్రైవేట్ సంస్థకు వ్యతిరేకంగా తీర్పునిస్తూ ప్రభుత్వానికే హక్కు ఉందని స్పష్టం చేసిందని హరీశ్రావు తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం కమీషన్ల కోసం ఆ తీర్పును కూడా పక్కనపెడుతున్నారని ఆరోపించారు. సామాన్యుల ఇళ్లను 22A జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తూ, మరోవైపు ఖరీదైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
తక్షణమే భూముల కేటాయింపును రద్దు చేసి, వాటిని ఆయిల్ఫెడ్కే దక్కేలా ఫ్రీహోల్డ్ హక్కులు కల్పించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రూ.500 కోట్ల ప్రభుత్వ భూములపై హరీశ్రావు ఆరోపణలు.. సీఎం రేవంత్కు బహిరంగ లేఖ
3