న్యూఢిల్లీ: ఢిల్లీలో విద్యార్థుల నిరసన సందర్భంగా జరిగిన బలప్రయోగంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పోలీసుల చర్యలను ప్రశ్నిస్తూ, ఘటనకు బాధ్యులైన అధికారులను గుర్తించి జవాబుదారీగా నిలపాలని డిమాండ్ చేశారు.
జూలై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యా వ్యవస్థలో సంస్కరణలు, పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోరుతూ విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేసినట్లు వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు గాయపడినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
నిరసనలో పెల్లెట్ గన్లు ఉపయోగించారన్న ఆరోపణలను రాహుల్ గాంధీ తన లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. విద్యార్థులపై ఇలాంటి ప్రమాదకరమైన ఆయుధాలను ఉపయోగించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
పెల్లెట్ గన్ దాడిలో 19 ఏళ్ల విద్యార్థి సాహిల్ లోచాబ్ తీవ్రంగా గాయపడి, కంటి చూపు కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. విద్యార్థులపై జరిగిన చర్యలను ఆయన “అమానవీయ దాడి”గా అభివర్ణిస్తూ, పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరారు.
నిరసనకారులను లాఠీలతో కొట్టిన సాధారణ దుస్తుల్లో ఉన్న వ్యక్తుల పాత్రపైనా రాహుల్ గాంధీ ప్రశ్నలు లేవనెత్తారు. వారు ఢిల్లీ పోలీసులకు చెందిన వారా, ఇతర భద్రతా సిబ్బందా లేదా వాలంటీర్లా అనే విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
సాధారణ దుస్తుల్లో ఉన్నవారిని ఉపయోగించి నిరసనకారులపై బలప్రయోగం చేయడం తీవ్రమైన అంశమని, అలాంటి చర్యలకు అధికారిక అనుమతి ఉందా లేదా చెప్పాలని ఆయన కోరారు.
విద్యార్థులపై బలప్రయోగం ఎవరి ఆదేశాలతో?: రాహుల్ గాంధీ
0
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla