మహారాష్ట్రలోని పుణెలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన 65 ఏళ్ల భీమ్రావ్కు మరణశిక్ష విధిస్తూ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనను 'అత్యంత అరుదైన కేసు'గా పరిగణించిన కోర్టు, శిక్షను తగ్గించే పరిస్థితి లేదని స్పష్టం చేసింది.
దర్యాప్తు వివరాల ప్రకారం, 2026 మే 1న మహారాష్ట్రలోని నస్రాపూర్ గ్రామానికి చెందిన భీమ్రావ్, అప్పుడే పుట్టిన దూడను చూపిస్తానని చెప్పి మూడేళ్ల చిన్నారిని నిర్మానుష్య ప్రాంతంలోని పశువుల షెడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం బండరాయితో హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టారు. అనంతరం పశువుల షెడ్డులో చిన్నారి మృతదేహం లభించడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. కేసు దర్యాప్తును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకోగా, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా విచారణ పురోగతిని పర్యవేక్షించినట్లు అధికారులు తెలిపారు.
విచారణ అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని ప్రత్యేక కోర్టు తేల్చింది. నేరం అత్యంత క్రూరమైనదని, బాధితురాలు అత్యంత పసిపాప కావడం, నమ్మకాన్ని దుర్వినియోగం చేసి నేరానికి పాల్పడటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇది 'రేర్స్ట్ ఆఫ్ ది రేర్' కేసుగా భావించినట్లు కోర్టు పేర్కొంది. అందువల్ల దోషికి మరణశిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది.
మూడేళ్ల చిన్నారి హత్యాచారం కేసు.. దోషికి ఉరిశిక్ష విధించిన కోర్టు
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan