ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటనలో భాగంగా ఆదివారం ఆ దేశ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. స్టేట్ హౌస్లో జరిగిన ఈ సమావేశంలో భారత్-సీషెల్స్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు.
ఈ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హాజరయ్యారు. సముద్ర భద్రత, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రాంతీయ సహకారం, అభివృద్ధి కార్యక్రమాలపై ఇరు దేశాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.
అంతకుముందు స్టేట్ హౌస్లో ప్రధాని మోదీకి సీషెల్స్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీ సమక్షంలో గౌరవ వందనం స్వీకరించిన మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
శనివారం విక్టోరియాకు చేరుకున్న ప్రధాని మోదీకి అధ్యక్షుడు హెర్మినీతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గుజరాత్లోని కచ్ ప్రాంతానికి చెందిన సాంప్రదాయ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్ను సందర్శించారు. అలాగే భారత్ నిర్మించిన ఫాస్ట్ పట్రోల్ వెసెల్ PS LESPWAR, ఆరు అంబులెన్స్లు, పది యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ గైడెడ్ బోట్లు సీషెల్స్కు అందజేశారు. సముద్ర నిఘా, ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ) భద్రతను బలోపేతం చేయడంలో ఇవి కీలకంగా ఉపయోగపడనున్నాయి.
సీషెల్స్ స్వాతంత్ర్యానికి 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం జరిగే గోల్డెన్ జూబ్లీ జాతీయ దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భద్రత, సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
సీషెల్స్ అధ్యక్షుడితో మోదీ కీలక చర్చలు.. ద్వైపాక్షిక బంధాల బలోపేతం
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan