ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ అర్జీలను కేవలం పరిపాలనా ఫైళ్లుగా కాకుండా మానవీయ సమస్యలుగా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును సమీక్షించిన ఆయన, అర్జీదారుల స్థానంలో తామే ఉన్నట్లు భావించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజలు కార్యాలయాలకు వచ్చినప్పుడు ఉద్యోగులు, అధికారులు సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా మాట్లాడాలని చంద్రబాబు చెప్పారు. సమస్యను వెంటనే పరిష్కరించడం సాధ్యం కాకపోతే కారణాన్ని స్పష్టంగా వివరించాలని, పరిష్కారానికి అవసరమైన తదుపరి చర్యలను తెలియజేయాలని సూచించారు. ఈ విధానం వల్ల ప్రభుత్వ పాలనపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వ్యవహార నైపుణ్యాలను కూడా పెంపొందించుకోవాలని సీఎం తెలిపారు. ప్రతి విభాగంలో ఉన్న మానవ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఉద్యోగుల సామర్థ్యాలను నిరంతరం మెరుగుపరచాలని సూచించారు. వినూత్న ఆలోచనలతో పనిచేసే వారిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు. బాధ్యతల కేటాయింపులో పనితీరు, ప్రజల స్పందన, సమస్యల పరిష్కార నాణ్యతను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ శాఖల పనితీరును క్రమం తప్పకుండా విశ్లేషిస్తామని, మంచి ఫలితాలు చూపిన ఉద్యోగులు, అధికారులకు తగిన గుర్తింపు ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అదే సమయంలో నిర్లక్ష్యం, ప్రజల పట్ల అనుచిత ప్రవర్తన, అర్జీల పరిష్కారంలో అనవసర జాప్యాన్ని సహించబోమని హెచ్చరించారు. ఫిర్యాదును మూసివేయడమే లక్ష్యంగా కాకుండా అర్జీదారు సంతృప్తి చెందేలా శాశ్వత పరిష్కారం చూపాలని తెలిపారు.
అర్జీలు పరిష్కరించే అధికారుల ప్రవర్తనే ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందని సీఎం అన్నారు. సమస్యను శ్రద్ధగా విని, బాధితుడికి గౌరవం ఇచ్చి, స్పష్టమైన పరిష్కారం చూపాలని మరోసారి సూచించారు కూడా.
రాష్ట్రంలో ప్రతి అంశాన్ని రాజకీయ వివాదంగా మార్చేందుకు కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని సీఎం ఆరోపించారు. కులం, మతం రంగులు పులిమి ఘటనలను వివాదాస్పదం చేస్తున్నాయని, తప్పుడు ప్రచారాల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులను బద్నాం చేయాలని చూస్తున్నాయని అన్నారు. ఇటువంటి ప్రచారాలను గుర్తించి వాస్తవాలను వేగంగా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. అధికారులు రాజకీయ వాదప్రతివాదాల్లోకి వెళ్లకుండా అధికారిక సమాచారం ఆధారంగా మాత్రమే స్పందించాలని చెప్పారు.
సామాజిక మాధ్యమాల్లో వ్యాపించే తప్పుడు సమాచారం, విద్వేషాలను పెంచే ఘటనలపై సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజల్లో భయం లేదా ఉద్రిక్తతకు దారితీసే ప్రచారం కనిపించినప్పుడు చట్టపరమైన, పరిపాలనా చర్యలు సమన్వయంతో చేపట్టాలని సూచించారు.
డ్రగ్స్, గంజాయి వినియోగం, మానసిక సమస్యల కారణంగా కొందరు నేరాలకు పాల్పడుతున్నారని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలను అరికట్టడంలో పోలీసు చర్యలతో పాటు అవగాహన, కౌన్సెలింగ్, పునరావాసం కూడా అవసరమన్నారు. గతంలో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు గుర్తించి నిందితులను పట్టుకుని శిక్షిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
తప్పు చేసిన వారు ఎంతకాలం గడిచినా తప్పించుకోలేరనే నమ్మకాన్ని ప్రజల్లో పెంచాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పీజీఆర్ఎస్ పరిష్కారం నుంచి నేర నియంత్రణ వరకు ప్రతి శాఖ బాధ్యత, పారదర్శకత, మానవీయ దృక్పథంతో పనిచేసినప్పుడే ప్రజా విశ్వాసం బలపడుతుందని పేర్కొన్నారు.
ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించి విశ్వాసం పెంచాలని అధికారులకు సూచన
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan