టాలీవుడ్ నిర్మాత బండ్ల గణೇಶ್ మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. అరుదైన వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న చిన్నారి నిరంజన్ను పరామర్శించేందుకు ఆయన తెలంగాణలోని హనుమకొండకు వెళ్లారు. హనుమాన్ నగర్లోని బాలుడి ఇంటికి చేరుకున్న బండ్ల గణేష్, చిన్నారితో ఆప్యాయంగా మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు.
ఈ సందర్శన సందర్భంగా తన నిర్మాణ సంస్థ ‘పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్’ తరఫున రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన చెక్కును చిన్నారి తల్లిదండ్రులు రాంగోపాల్ చారి, మానసలకు అందజేశారు. ఈ మొత్తాన్ని నిరంజన్ భవిష్యత్తు అవసరాల కోసం అతని పేరుతోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని వారికి సూచించారు. తక్షణ సహాయం ఇచ్చి ముందుకు సాగిపోవడం కంటే, ఆ సాయం బాలుడి భవిష్యత్తుకు ఉపయోగపడాలనే ఉద్దేశం ఆయన మాటల్లో కనిపించింది.
సాయం అనంతరం మీడియాతో మాట్లాడిన బండ్ల గణేష్, ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ స్ఫూర్తే కారణమని చెప్పారు. ఇటీవల హనుమకొండ పర్యటనలో పవన్ కళ్యాణ్ నిరంజన్ను పరామర్శించినప్పుడే ఈ బాలుడి పరిస్థితి తన దృష్టికి వచ్చిందన్నారు. తనకు దైవసమానుడైన పవన్ కళ్యాణ్ చూపిన సేవా స్పూర్తితోనే తాను కూడా తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నానని అన్నారు.
ఇంకో ఆసక్తికర విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఈ రోజు నారా భువనేశ్వరి జన్మదినం కావడంతో, ఆ సందర్భంలో ఈ సహాయం అందించడం తనకు మరింత సంతృప్తినిచ్చిందని చెప్పారు. ప్రస్తుతం తన కుమార్తె వివాహ ఏర్పాట్లతో బిజీగా ఉన్నప్పటికీ, ఈ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించి ఇక్కడికి వచ్చినట్లు వెల్లడించారు.
అత్యంత ముఖ్యంగా, ఈ సందర్శనను రాజకీయ వేదికగా మార్చాలనుకోవడం లేదని బండ్ల గణేష్ స్పష్టం చేశారు. తాను ఇక్కడికి కేవలం మానవతా దృక్పథంతో వచ్చానని, చిన్నారి త్వరగా కోలుకుని సాధారణ జీవితం గడపాలని కోరుకుంటున్నానని అన్నారు. సినిమా, రాజకీయాలకతీతంగా ఇలాంటి సమయంలో ముందుకొచ్చే చేయూతే ఎక్కువ విలువైనది. నిరంజన్ కుటుంబానికి అందిన ఈ సాయం, ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఓ మానసిక బలమూ కూడా.
పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో చిన్నారికి బండ్ల గణేష్ రూ.5 లక్షల సాయం
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan