ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ ఛత్రినాకలోని ఆయన నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు పలు ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం కేసు నమోదు చేసిన తర్వాత అధికారులు సోదాలు ప్రారంభించారు. నరహరి ఇంట్లోనే రూ.1.54 కోట్ల నగదు, కిలో బంగారం గుర్తించినట్టు ఆయన తెలిపారు. నగదును బెడ్రూమ్లోని బీరువా పైన ఉన్న కబోర్డులో గుర్తించినట్టు చెప్పారు. ఏసీబీ దాడుల్లో ఇంత భారీగా నగదు దొరకడం అరుదని అధికారులు పేర్కొన్నారు.
తనిఖీల్లో రూ.కోటి ఫిక్స్డ్ డిపాజిట్లు, రెండు లాకర్లు ఉన్నట్టు గుర్తించారు. ఆస్తి పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఆ ఆస్తుల విలువ సుమారు రూ.5 కోట్లు ఉండొచ్చని, మార్కెట్ విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. నరహరి కుమారుడి పేరుపైనా ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్లు వెల్లడించారు.
లాకర్లను తెరిచేందుకు సంబంధిత బ్యాంక్ అధికారులకు లేఖ రాసినట్టు ఏసీబీ తెలిపింది. లాకర్లు తెరిచిన తర్వాత మరిన్ని ఆస్తులు లేదా పత్రాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, బంగారం, డిపాజిట్ల వివరాలను నరహరి అధికారిక ఆదాయంతో పోల్చి చూస్తున్నారు.
సోదాలు ప్రారంభమైన సమయంలో నరహరి, ఆయన కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నట్టు సమాచారం. అధికారులు ఇంట్లోకి బయటి వ్యక్తులను అనుమతించకుండా, సోదాలను పర్యవేక్షణలో కొనసాగించారు. నరహరిని అరెస్ట్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఆయనను కోర్టులో హాజరుపరచనున్నట్టు వెల్లడించారు.
ఈ కేసులో ప్రధానంగా ఆదాయానికి మించిన ఆస్తుల మూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. స్వాధీనం చేసుకున్న సొత్తు, పత్రాలు, లాకర్ల వివరాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. ఏసీబీ అధికారిక ప్రకటన తర్వాత పూర్తి ఆస్తుల విలువపై మరింత స్పష్టత రానుంది.
ల్యాండ్స్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ భారీ సోదాలు
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan