అసోంలోని ధేమాజీ జిల్లాలో భారీ వర్షాలు, వరదల కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం 69 గ్రామాల్లో దాదాపు 16 వేల మంది ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడుతున్నారు.
వరదల కారణంగా నదీ తీరాలు కోతకు గురికావడంతో ఆర్చిపథర్-సిమెన్ చాపరి మధ్య ఉన్న రైల్వే వంతెన దెబ్బతింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేశారు. ముర్కోంగ్సెలెక్-సిలాపథర్ మధ్య ప్రయాణించే వారికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. బాధితుల తక్షణ భద్రతతో పాటు దీర్ఘకాలిక పునరావాసానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సంబంధిత మంత్రులు, జిల్లా యంత్రాంగం ధేమాజీలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
రైల్వే శాఖ కూడా పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ ప్రయాణికులకు హెల్ప్డెస్క్ల ద్వారా అవసరమైన సమాచారం, సహాయం అందిస్తోంది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే అవకాశముందని అధికారులు తెలిపారు.
అసోంలో ఉద్ధృతమైన వరదలు.. 16 వేల మంది ప్రభావితం, రైళ్లు నిలిపివేత
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan