బెంగళూరులో సంచలనం సృష్టించిన కేఆర్ పురం త్రిపుల్ మర్డర్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. తండ్రి సోమసుందర, తల్లి ముత్తులక్ష్మి, చెల్లెలు సుప్రియ హత్య కేసులో ప్రధాన నిందితురాలు శ్వేతను పుదుచ్చేరి రైల్వే స్టేషన్లో కృష్ణరాజపురం పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు, ఆమె ప్రియుడు కెనెత్ కోసం గాలింపు కొనసాగుతోంది.
ప్రాథమిక విచారణలో శ్వేత తన తల్లిదండ్రులు తన జీవితాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారని, వ్యక్తిగత స్వేచ్ఛ లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం ఇద్దరూ కలిసి పరారైనప్పటికీ, ఆ తర్వాత విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
పోలీసులు ఘటనాస్థలంలో శ్వేత వ్యక్తిగత డైరీని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒంటరితనం, మానసిక ఒత్తిడి, ప్రేమ కోసం తపన, తన భావోద్వేగాలను వ్యక్తపరిచే పలు వాక్యాలు రాసి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే డైరీలోని విషయాలపై పోలీసులు ఇంకా సమగ్రంగా విచారణ కొనసాగిస్తున్నారు.
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం శ్వేత, కెనెత్ ఇంజినీరింగ్ చదివే సమయంలో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. అనంతరం ఉద్యోగాలు చేస్తూ సహజీవనం ప్రారంభించారు. కొద్ది వారాల క్రితం ఉద్యోగాలు వదిలి వ్యాపారం ప్రారంభించేందుకు రూ.30 లక్షల బ్యాంకు రుణం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రుణ చెల్లింపుల్లో సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం.
ఘటన జరిగిన రోజు కుటుంబ సభ్యులు శ్వేతను కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లగా వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆ సమయంలో శ్వేత, కెనెత్ కలిసి ముగ్గురిపై కత్తులతో దాడి చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న కెనెత్ను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.
ప్రేమ కోసం కుటుంబాన్నే చంపా.. బెంగళూరు హత్య కేసులో శ్వేత ఒప్పుకోలు
10
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan