ధర్మస్థలలో అనుమానాస్పద మృతదేహాల ఖననం, రూ.200 కోట్ల డీల్ ఆరోపణల నేపథ్యంలో తన పేరు ప్రస్తావనకు రావడంపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. బుధవారం బెంగళూరు ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు.
ఈ కేసులో ‘ముసుగు వ్యక్తి’గా ప్రచారంలో ఉన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య చేసిన వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. ధర్మస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకు కేరళ నుంచి రూ.200 కోట్లు వచ్చాయని, ఆ విషయం తనకు కూడా తెలుసని చిన్నయ్య చేసిన ఆరోపణలను ఆయన పూర్తిగా ఖండించారు.
తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని, ఆలయ బాధ్యులను గానీ, సంబంధిత వ్యక్తులను గానీ ఎప్పుడూ కలవలేదని చెప్పారు. చిన్నయ్య తనతో మాట్లాడేందుకు ప్రయత్నించిన విషయం మాత్రం నిజమేనని వెల్లడించారు. మాజీ పోలీసు అధికారి గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్య తనతో ఫోన్లో మాట్లాడాడని తెలిపారు. అతని మాటల తీరు అనుమానాస్పదంగా అనిపించడంతో వెంటనే సిట్ అధిపతి ప్రణబ్ మొహంతీకి సమాచారం అందించినట్లు చెప్పారు.
ధర్మస్థల ఆరోపణలపై వాస్తవాలు బయటపడాలని, దర్యాప్తు జరగాలని అప్పటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తొలిసారిగా కోరింది తానేనని కూడా గుర్తుచేశారు. ఈ వ్యవహారంలో తన పాత్రపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలను కోరారు.
ఇదే సమయంలో మీడియా సమావేశంలో ‘పెయిడ్ మీడియా’ వ్యాఖ్యలపై విలేకరులు అభ్యంతరం వ్యక్తం చేయగా, అందరినీ ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు. కోర్టుల కంటే ముందే కొన్ని మీడియా సంస్థలు తీర్పులు ఇస్తున్నాయని విమర్శించారు.
సౌజన్య హత్యాచారం కేసులో నిజమైన నిందితులకు కఠిన శిక్ష పడాలని మాత్రమే తాను కోరుతున్నానని, ధర్మస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించే ఉద్దేశం తనకు లేదని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
ధర్మస్థల వివాదంతో తనకు సంబంధం లేదన్న ప్రకాష్ రాజ్
5
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan