11000 litres of milk poured into narmada sparks environmental concern

11,000 లీటర్ల పాలు నర్మదలోకి.. పూజా పేరుతో కాలుష్యం? వివాదం

5

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

మధ్యప్రదేశ్‌లోని సీహోర్ జిల్లా భైరూందా ప్రాంతంలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 21 రోజులపాటు నిర్వహించిన ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వాహకులు నర్మద నదిలోకి దాదాపు 11,000 లీటర్ల పాలను పోశారు. ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చిన ఈ పాలను “నదీ శుద్ధి” కోసం సమర్పించామని వారు పేర్కొన్నారు.

కానీ ఈ చర్యపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాలు నదిలో కలిసినప్పుడు అవి సేంద్రియ కాలుష్యంగా మారి నీటిలో ఆక్సిజన్ స్థాయిని తగ్గిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నర్మద నదిపై ఆధారపడే చేపలు, ఇతర జలచరాలు దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెబుతున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ నీటినే తాగునీటిగా ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఇది మరింత సమస్యగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు.

పర్యావరణవేత్త అజయ్ దూబే ఈ అంశంపై గట్టిగా స్పందించారు. నదులను పూజించాలంటే వాటిని కాపాడాలి గానీ, ఇలాంటి చర్యలతో కాలుష్యం పెంచకూడదని ఆయన అన్నారు. ఒకవైపు నీటి కొరత సమస్యలు, మరోవైపు నదుల కాలుష్యం పెరుగుతున్న సమయంలో ఇలాంటి కార్యక్రమాలు బాధ్యతారాహిత్యంగా కనిపిస్తున్నాయని విమర్శించారు.

ఇక నిర్వాహకులు మాత్రం తమ చర్యను సమర్థిస్తున్నారు. ఇది సంప్రదాయం భాగమని, నర్మదకు అర్పణగా పాలను సమర్పించామని చెబుతున్నారు. కానీ ఈ వివరణపై కూడా విమర్శలు వస్తున్నాయి. సంప్రదాయాలు కూడా కాలానికి అనుగుణంగా మారాలని, ప్రకృతికి హాని కలిగించే విధానాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్