ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ఒక్కసారిగా సంచలనంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో డెబ్యూ ఓవర్లో మూడు వికెట్లు తీసిన తొలి బౌలర్గా నిలిచాడు.
217 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్కు మొదటి ఓవర్ నుంచే షాక్ తగిలింది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, లువాన్ ప్రిటోరియస్ వంటి కీలక బ్యాటర్లను వరుసగా ఔట్ చేసి హింగే మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసిన అతని బౌలింగ్ ప్రత్యర్థిని పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది.
ఆ తర్వాత కూడా అతను ఆగలేదు. తన రెండో ఓవర్లో మరో కీలక వికెట్ తీసి మొత్తం నాలుగు వికెట్లతో మ్యాచ్ను ముగించాడు. మరోవైపు సకిబ్ హుస్సేన్ కూడా నాలుగు వికెట్లతో అదరగొట్టడంతో రాజస్థాన్ కేవలం 159 పరుగులకే కుప్పకూలింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 216 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇషాన్ కిషన్ 91 పరుగులతో జట్టుకు బలమైన పునాది వేశాడు. క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి చివర్లో వేగంగా పరుగులు జోడించడంతో స్కోరు మరింత పెరిగింది.
ప్రఫుల్ హింగే గురించి చెప్పాలంటే, మహారాష్ట్రకు చెందిన ఈ 24 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ దేశవాళీ క్రికెట్లో ఇప్పటికే తన ప్రతిభను చూపించాడు. కేవలం 10 మ్యాచ్ల్లో 27 వికెట్లు తీసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ అతన్ని 30 లక్షలకు కొనుగోలు చేసింది.
ప్రఫుల్ హింగే సంచలనం తొలి ఓవర్లోనే 3 వికెట్లు IPLలో చరిత్ర
12
Published on: 📅 14 Apr 2026, 07:32 AM
Reported by: 🖊
Eswar Pavan