indian-stock-markets-surge-as-oil-prices-fall-after-us-iran-peace-deal

చమురు ధరలు తగ్గడంతో భారీ లాభాల్లో దేశీయ మార్కెట్లు

5

Published: 📅
Reported by: 🖊 Eswar Pavan

పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడుతుందన్న సంకేతాలు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో సోమవారం బలమైన కొనుగోళ్లకు దారితీశాయి. అమెరికా-ఇరాన్‌ శాంతి ఒప్పందం ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో మదుపర్ల సెంటిమెంట్‌ మెరుగుపడింది. దీంతో సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు ఉదయం ట్రేడింగ్‌లో భారీ లాభాలు నమోదు చేశాయి.

ఉదయం 9.28 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1,069 పాయింట్లు లాభపడి 76,597 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 327 పాయింట్లు పుంజుకొని 23,950 వద్ద కదలాడుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో సెన్సెక్స్‌ 1,200 పాయింట్ల వరకు ఎగబాకినట్లు మార్కెట్‌ వర్గాల సమాచారం. డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలపడింది. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి 94.68 వద్ద ఉండగా, మే 8 తర్వాత ఇదే మెరుగైన స్థాయిగా పేర్కొన్నారు.

నిఫ్టీ సూచీలో శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌, టీఎంపీవీ, బజాజ్‌ ఫైనాన్స్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌, అపోలో హాస్పిటల్స్‌, సన్‌ ఫార్మా షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చమురు ధరల తగ్గుదలతో దిగుమతి ఆధారిత రంగాలు, విమానయాన రంగం, ఆర్థిక రంగంపై సానుకూల ప్రభావం కనిపిస్తున్నట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

శాంతి ఒప్పందం ప్రకటన తర్వాత వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియెట్‌ ధర నాలుగు శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు 80.91 డాలర్లకు చేరింది. బ్రెంట్‌ క్రూడ్‌ 3.95 శాతం తగ్గి 83.88 డాలర్ల వద్దకు దిగింది. చమురు ధరలు తగ్గడం భారత్‌ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాలకు కీలక అంశం. ముడి చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిడి, దిగుమతి బిల్లు, కరెన్సీ ఒత్తిడిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

రాజకీయాలు