కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత తగ్గలేదు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో నౌకల రాకపోకలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. ఇరాన్ తాజాగా సీమైన్స్ అమర్చినట్లు వెల్లడించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది.
హర్మూజ్లో తమ సైనిక విభాగం భారీగా సీమైన్స్ ఏర్పాటు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఏ ప్రాంతాల్లో అవి ఉన్నాయో సూచిస్తూ ఒక చార్ట్ విడుదల చేసింది. సాధారణంగా నౌకలు ప్రయాణించే మార్గాల్లోనే ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు అందులో కనిపించింది. దీంతో నౌకాయాన సంస్థలు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.
ప్రస్తుతం నౌకల రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించబడలేదు. కాల్పుల విరమణ తర్వాత కూడా కేవలం కొద్ది నౌకలే ఈ మార్గం గుండా ప్రయాణించినట్లు సమాచారం. వందల సంఖ్యలో ట్యాంకర్లు సమీపంలోనే నిలిచిపోయాయి. రవాణా మందగించడం వల్ల అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇరాన్ విధించిన కొత్త నియమాలు కూడా పరిస్థితిని మరింత కఠినతరం చేస్తున్నాయి. రోజుకు పరిమిత సంఖ్యలోనే నౌకలకు అనుమతి, ముందస్తు అనుమతి తప్పనిసరి వంటి షరతులు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది సముద్ర రవాణాను పూర్తిగా తమ నియంత్రణలోకి తీసుకురావాలనే వ్యూహంగా భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో భారత నావికులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, సమస్యాత్మక ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం హర్మూజ్లో పరిస్థితి స్థిరపడలేదు. కాల్పులు ఆగినా, సముద్ర మార్గంలో ముప్పు ఇంకా పూర్తిగా తగ్గలేదు.
కాల్పుల విరమణైనా టెన్షన్ కొనసాగుతుంది.. హర్మూజ్లో ఇరాన్ కొత్త షాక్
3
Published on: 📅 10 Apr 2026, 07:37 AM
Reported by: 🖊
Eswar Pavan