deputy collector vamsi mohan arrested in medchal-malkajgiri massive illegal assets seized

మేడ్చల్-మల్కాజ్‌గిరి డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అరెస్ట్, భారీ అక్రమ ఆస్తులు వెలుగులోకి

0

Published: 📅
Reported by: 🖊 Venkata Dodla

హైదరాబాద్, మే 23: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి, సోదాల అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు తెలంగాణలో సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులు నిర్వహించిన విస్తృత సోదాల్లో వంశీ మోహన్‌కు చెందిన భారీ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం 19 ఇళ్ళు, మణికొండ, మజీద్‌బండలోని లగ్జరీ ఫ్లాట్లు, వనస్థలిపురంలో రెండు ఎకరాల ఫార్మ్‌హౌస్, బ్యాంక్ ఖాతాల్లో రూ.20 లక్షల డిపాజిట్, ఇంట్లో రూ.2.10 లక్షల నగదు, 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ఖరీదైన కార్లు స్వాధీనం అయ్యాయి. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు, అయితే అధికారిక రిజిస్ట్రేషన్ విలువ కేవలం రూ.6.22 కోట్లు మాత్రమే.

2019 నుంచి 2023 మధ్య వంశీ మోహన్ శేరిలింగంపల్లి ఎమ్మార్వోగా పనిచేసిన సమయంలో అనేక అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు లభించాయి. ముఖ్యంగా సాహెబ్‌నగర్‌లో నాలుగు ప్లాట్లను అక్రమంగా రెగ్యులర్ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. తన మేనమామ పేరిట 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసి, దానికి బదులుగా 10 ప్లాట్లను గిఫ్ట్ డీడ్‌లో పొందినట్లు కూడా ఏసీబీ అనుమానిస్తోంది.

సోమవారం వివిధ ప్రాంతాల్లోని రియల్టర్ నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, భూమి, లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వంశీ మోహన్ కేసు మరింత విస్తృతంగా దర్యాప్తు చేయబడుతున్నందున, తదుపరి రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రావడం అంచనా వేస్తున్నారు.