విజయవాడలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చేలా ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతిలో ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో తొలి మూడు స్థానాలు సాధించిన నలభై మంది విద్యార్థులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, గద్దె అనురాధ దంపతులు ఘనంగా సత్కరించారు. ప్రతిభ చూపిన ప్రతి విద్యార్థికి ఐదు వేల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు. మొత్తం రెండు లక్షల రూపాయలను విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఇచ్చారు.
ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. రాష్ట్ర సంపద కూడా యువతేనని కూటమి ప్రభుత్వం బలంగా నమ్ముతోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం చాలా ఆనందకరమన్నారు. మంత్రి నారా లోకేశ్ విద్యా అనుభవాన్ని ఉపయోగించి నూరు రోజుల కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఆ కార్యక్రమం ఫలితంగా పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
పిల్లల చదువు ఎక్కడా ఆగకూడదని రామ్మోహన్ స్పష్టం చేశారు. తల్లిదండ్రులు ఫీజుల గురించి ఆందోళన చెందకుండా పిల్లలను చదివించాలని సూచించారు. అవసరమైన చోట ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధి, విద్యా అవకాశాలు కలిసివస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బలపడుతుందని అన్నారు.
ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమని రామ్మోహన్ పేర్కొన్నారు. అమరావతి నిర్మాణం కూడా వ్యక్తుల కోసం కాదని, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అని చెప్పారు. అమరావతి నగరం భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పించే కేంద్రంగా మారుతుందని అన్నారు.
గద్దె అనురాధ మాట్లాడుతూ ఈ కార్యక్రమం మరెంతో మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు స్ఫూర్తి ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండో, మూడో స్థానాలు సాధించిన విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులను కూడా అభినందించడం మంచి సంప్రదాయమన్నారు. చంద్రబాబు ముందడుగు, లోకేశ్ విద్యా సంస్కరణలు, ఉపాధ్యాయుల సమిష్టి కృషి వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.
పదో తరగతి టాపర్లకు గద్దె రామ్మోహన్ సత్కారం
0
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla