హైదరాబాద్ నుంచి ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ పెద్ద అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులను దృష్టిలో పెట్టుకుని భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్లతో 4 ప్రత్యేక పుణ్యయాత్ర ప్యాకేజీలను ప్రకటించింది. ఏప్రిల్ చివరి నుంచి జూన్ మధ్య వరకు ఈ ప్రత్యేక యాత్రలు నడవనున్నాయి. ఒకే టికెట్లో రైలు ప్రయాణం, భోజనం, వసతి, దర్శన ఏర్పాట్లు, లోకల్ ట్రాన్స్ఫర్లు వంటి సదుపాయాలు ఉండటం ఈ ప్యాకేజీల ప్రధాన ఆకర్షణ.
మొదటి ప్యాకేజీ అయోధ్య–కాశీ–బైದ್ಯనాథ్ ధామ్ దర్శన్ యాత్ర. ఇది ఏప్రిల్ 28 నుంచి మే 7 వరకు నడుస్తుంది. ఈ యాత్రలో పూరీ, కోణార్క్, బైద్యనాథ్ ధామ్, వారణాసి, అయోధ్య, ప్రయాగ్రాజ్ వంటి కేంద్రాలు ఉన్నాయి. రెండో ప్యాకేజీ హరిద్వార్–మాతా వైష్ణోదేవి–రిషికేశ్ యాత్ర. ఇది మే 12 నుంచి మే 21 వరకు ఉంటుంది. ఇందులో మథుర, వృందావన్, వైష్ణోదేవి, హరిద్వార్, రిషికేశ్ దర్శనాలు ఉంటాయి.
మూడో ప్యాకేజీ దివ్య దక్షిణ యాత్ర. ఇది మే 24 నుంచి మే 31 వరకు నడుస్తుంది. తిరువణ్ణామలై అరుణాచలం, రామేశ్వరం, మదురై, కన్యాకుమారి, త్రిచీ, తంజావూరు, చిదంబరం వంటి క్షేత్రాలను కవర్ చేస్తుంది. నాలుగోది యమునా పుష్కరాల స్పెషల్ యాత్ర. ఇది జూన్ 3 నుంచి జూన్ 12 వరకు ఉంటుంది. ఇందులో కూడా అయోధ్య, కాశీ, ప్రయాగ్రాజ్తో పాటు బైద్యనాథ్ ధామ్ సర్క్యూట్ ఉంటుంది.
టికెట్ ధరలు కూడా ప్యాకేజీ వారీగా నిర్ణయించారు. అయోధ్య–కాశీ మరియు యమునా పుష్కరాల స్పెషల్ యాత్రలకు స్లీపర్ రూ.16,700, 3ఏసీ రూ.26,100, 2ఏసీ రూ.34,100గా ఉన్నాయి. హరిద్వార్–వైష్ణోదేవి యాత్రకు స్లీపర్ రూ.16,500 నుంచి, దివ్య దక్షిణ యాత్రకు స్లీపర్ రూ.14,500 నుంచి ఛార్జీలు ప్రారంభమవుతున్నాయి. బుకింగ్ల కోసం ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్తో పాటు 9701360701, 9281030727, 9281030759 హెల్ప్లైన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయి.
మొత్తానికి, సమ్మర్ సీజన్ను టార్గెట్ చేస్తూ ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన ఈ 4 యాత్రలు భక్తులకు ఒకే దెబ్బకు ఉత్తర, దక్షిణ భారత పుణ్యక్షేత్రాల దర్శన అవకాశం ఇస్తున్నాయి. సీట్లు పరిమితంగా ఉండే అవకాశం ఉండటంతో ముందస్తు బుకింగ్కి డిమాండ్ పెరగొచ్చు.
హైదరాబాద్ నుంచి 4 భారత్ గౌరవ్ యాత్రలు.. ఒకే టికెట్లో రైలు, భోజనం, దర్శనం
9
Published on: 📅 11 Apr 2026, 09:02 AM
Reported by: 🖊
Eswar Pavan