శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్లో ప్రతి ఏడాది జరిగే శోభాయాత్రకు ఈసారి కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యాత్ర సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. గత 16 ఏళ్లుగా ఈ శోభాయాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నామని, అదే విధంగా ఈసారి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు.
భద్రత పరంగా ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ వెల్లడించారు. యాత్రకు సుమారు 3000 మంది పోలీసులు విధుల్లో పాల్గొంటారని చెప్పారు. ముఖ్యంగా చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు జరగకుండా ప్రత్యేకంగా క్రైమ్ టీమ్స్, షీ టీమ్స్ను మోహరిస్తున్నామని పేర్కొన్నారు. యాత్ర జరిగే మార్గమంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచుతామని తెలిపారు. అలాగే డ్రోన్ల సహాయంతో కూడా యాత్రను పర్యవేక్షిస్తామని చెప్పారు.
గతేడాది వాహనాల బ్రేక్డౌన్ కారణంగా యాత్ర ఆలస్యమైన విషయాన్ని గుర్తుచేసిన సీపీ, ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహనాల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పారు. యాత్ర నిర్దేశిత సమయానికి పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇక నిర్వాహకులు కూడా కొన్ని సూచనలు పోలీసుల ముందు ఉంచారని, వాటిని పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. ప్రజలు సహకరించడంతో పాటు నియమాలను పాటిస్తే యాత్ర మరింత విజయవంతమవుతుందని అన్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హైదరాబాద్లో జరిగే ఈ శోభాయాత్రకు వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సమన్వయం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణతో ఈసారి శోభాయాత్ర మరింత సాఫీగా సాగుతుందని అధికారులు భావిస్తున్నారు.
శోభాయాత్రకు భారీ భద్రత.. పకడ్బందీ ఏర్పాట్లు
10
Published on: 📅 23 Mar 2026, 01:34 PM
Reporter: 🖊 Eswar Pavan