పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతం ప్రస్తుతం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకు ఇతర దేశాలు కలిసి రావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల మధ్య బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయల్ నేవీకి చెందిన అణు జలాంతర్గామి హెచ్ఎంఎస్ ఆన్సన్ను హర్మూజ్ జలసంధి సమీపానికి మోహరించినట్లు బ్రిటిష్ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ జలాంతర్గామి ఉత్తర అరేబియన్ సముద్రంలో ఉన్నట్లు సమాచారం. ఇందులో తోమహాక్ క్షిపణులు, భారీ టోర్పెడోలు వంటి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మోహరింపు సాధారణ చర్య కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రం అయితే, ఇరాన్పై నేరుగా సైనిక చర్యలు చేపట్టే అవకాశాన్ని ఇది సూచిస్తోందని అభిప్రాయపడుతున్నారు. హర్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం కావడంతో, అక్కడి పరిస్థితులు అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు ఈ ప్రాంతంలో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. ఖతార్కు చెందిన ఒక హెలికాప్టర్ పర్షియన్ గల్ఫ్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఆరుగురు మరణించినట్లు అధికారిక సమాచారం వెల్లడించింది. మరో వ్యక్తి గల్లంతయ్యాడు. అతడి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మరణించిన వారి వివరాలను ఇంకా వెల్లడించలేదు.
ఇక మొత్తంగా చూస్తే, హర్మూజ్ జలసంధి పరిసరాల్లో సైనిక చలనం పెరగడం, అణు జలాంతర్గాముల మోహరింపు, విమాన ప్రమాదాలు , ఈ ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయని సూచిస్తున్నాయి. ప్రపంచ దేశాలు ఈ పరిణామాలను అత్యంత జాగ్రత్తగా గమనిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఇరాన్, అమెరికా, బ్రిటన్ మధ్య ఉద్రిక్తతలు ఎలా మారుతాయో, అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంత ప్రభావం చూపుతాయో అనేది ఆసక్తికరంగా మారింది
హర్మూజ్ వద్ద ఉద్రిక్తతలు.. బ్రిటన్ అణు జలాంతర్గామి మోహరింపు
6
Published on: 📅 22 Mar 2026, 05:09 PM
Reporter: 🖊 Kiran Rao