పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, ముఖ్యంగా హర్మూజ్ జలసంధి చుట్టూ కొనసాగుతున్న అంతరాయం ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థకు కూడా నేరుగా ముప్పుగా కనిపిస్తోంది. మోర్గాన్ స్టాన్లీ తాజా అంచనా ప్రకారం, బ్రెంట్ ముడిచమురు ధర ఒక త్రైమాసికం పాటు బ్యారెల్కు 150 డాలర్లను తాకితే 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 5.7 శాతానికి పరిమితం కావచ్చు. కరోనా తర్వాతి కాలంలో ఇదే బలహీనమైన వృద్ధి రేటు అవుతుందని ఆ సంస్థ హెచ్చరించింది.
ప్రస్తుతం ఆ సంస్థ బేస్ కేస్ అంచనా మరింత మితంగా ఉంది. బ్రెంట్ సగటు ధర 95 డాలర్లుగా ఉంటుందనే ఊహలో FY27 వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.2 శాతానికి తగ్గించింది. అదే సమయంలో వినియోగదారుల ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతానికి పెంచింది. ఈ డౌన్గ్రేడ్ వెనుక ప్రధాన కారణం గల్ఫ్ ఘర్షణల వల్ల వస్తున్న సరఫరా అంతరాయం, ఇంధన దిగుమతి వ్యయం, దాని ప్రభావం ఉత్పత్తి ఖర్చులపై పడటం అని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది.
ఇక్కడ అసలు ప్రమాదం చమురు ధర మాత్రమే కాదు, దాని రెండో దెబ్బ. మోర్గాన్ స్టాన్లీ ప్రకారం 150 డాలర్ల షాక్ వస్తే రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ 6 శాతం పైపరిమితిని దాటే ప్రమాదం ఉంది. కరెంట్ అకౌంట్ లోటు జీడీపీలో సుమారు 3 శాతానికి చేరవచ్చు. ఇంధనం, ముడిసరుకు వ్యయాలు పెరగడం వల్ల ఉత్పత్తి దెబ్బతినడం, అధిక ధరలతో వినియోగం బలహీనపడటం, భౌగోళిక ఉద్రిక్తతల ప్రాంతాలకు ఎగుమతులు తగ్గడం అనే మూడు మార్గాల్లో ఈ షాక్ పనిచేస్తుందని నివేదిక చెబుతోంది.
మార్కెట్ వైపు చూస్తే ఈ హెచ్చరిక గాల్లో తేలుతున్న మాట కాదు. రాయిటర్స్ మార్చి 26న హర్మూజ్ మూసుకుపోయిన పరిస్థితి కొనసాగితే మార్కెట్లో 150 డాలర్ల చమురు రిస్క్పై బెట్లు పెరుగుతున్నాయని నివేదించింది. ఏప్రిల్ 2న జేపీ మోర్గాన్ కూడా సరఫరా అంతరాయం మే మధ్యవరకు సాగితే చమురు 150 డాలర్లకు మించి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అంటే మోర్గాన్ స్టాన్లీ worst-case scenario మార్కెట్ కల్పితం కాదు, ఇప్పటికే చర్చలో ఉన్న రిస్క్.
ఇదే సమయంలో భారత్ ప్రభుత్వ వర్గాలు తక్షణంగా FY27 ఆర్థిక లోటు లక్ష్యం 4.3 శాతానికి పెద్ద ప్రమాదం లేదని రాయిటర్స్కు చెప్పాయి. అయినా ఎరువులు, ఇంధన సబ్సిడీలు, ఎక్సైజ్ కోతలు, దిగుమతి వ్యయం పెరగడం వల్ల ఒత్తిడి పెరుగుతోందని అంగీకరించాయి. ఆర్బీఐ విషయానికి వస్తే, మార్చి చివరి రాయిటర్స్ పోల్ ప్రకారం repo rateను కనీసం సమీపకాలంలో 5.25 శాతానే ఉంచుతుందనే అంచనా ఉంది. అంటే చమురు షాక్ను మొదట ఎదుర్కోవాల్సింది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణే, వడ్డీ రేటు ఆయుధం కాదు.
ముడిచమురు 150 డాలర్లకు చేరితే భారత వృద్ధి 6 శాతం దిగువకు జారొచ్చని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరిక
12
Published on: 📅 08 Apr 2026, 06:55 AM
Reported by: 🖊
Eswar Pavan