శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని ఆసుపత్రుల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని తితిదే ఈవో అనిల్కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని తితిదే పరిపాలనా భవనంలో ఈవో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు అవకాశం కల్పిస్తున్న తరహాలోనే వైద్యనిపుణులు, సిబ్బందికి ఆన్లైన్లో నమోదు చేసుకొనే అవకాశం కల్పించాలని సూచించారు. శిక్షణ అనంతరం వారి సేవలను వినియోగించుకునేలా చూడాలన్నారు. అశ్వినీ, ఆయుర్వేద, స్విమ్స్, బర్డ్, చిన్నపిల్లల ఆసుపత్రుల్లో వారి సేవలను ఉపయోగించుకోవాలని చెప్పారు. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు తదితర ప్రాంతాల్లోని శ్రీవారి ఆలయాల్లో మొదటి విడతగా శ్రీవారి సేవను ప్రారంభించాలని ఆదేశించారు.