అమెరికా రాజధానిలో జరిగిన ఒక ప్రతిష్ఠాత్మక విందు ఒక్కసారిగా భయానక వాతావరణంగా మారింది. వాషింగ్టన్లోని వైట్ హౌస్ కరస్పాండెంట్స్ విందు సందర్భంగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో అక్కడున్న వందలాది మంది ప్రముఖులు, జర్నలిస్టులు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య జరిగిన కార్యక్రమంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు అమెరికా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు రేపుతోంది.
నివేదికల ప్రకారం వేడుక వెలుపల ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్, జేడీ వాన్స్తో పాటు పలువురు కీలక వ్యక్తులను భద్రతా సిబ్బంది వెంటనే అక్కడి నుంచి తరలించారు. సీక్రెట్ సర్వీస్ అధికారులు వేగంగా స్పందించి హాల్ పరిసరాలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కొందరు అతిథులు ప్రాణభయంతో టేబుళ్ల కింద దాక్కున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఈ ఘటనపై ట్రంప్ స్పందిస్తూ తామంతా సురక్షితంగా ఉన్నామని తెలిపారు. భద్రతా సిబ్బంది వేగంగా, ధైర్యంగా పనిచేశారని ఆయన ప్రశంసించారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కూడా పేర్కొన్నారు. నిందితుడి వద్ద ఆయుధాలు ఉన్నాయని, ఘటనాస్థలంలో తుపాకీకి సంబంధించిన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపినట్టు సమాచారం.
అయితే పెద్ద ప్రశ్న ఇప్పుడు భద్రతపైనే ఉంది. దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మంత్రులు, ప్రముఖ జర్నలిస్టులు పాల్గొనే కార్యక్రమం దగ్గరికి ఆయుధంతో వ్యక్తి ఎలా చేరుకున్నాడు అన్న సందేహం మరింత బలపడుతోంది. ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగించినా, ఇది సాధారణ భద్రతా ఘటనగా తీసుకునే విషయం కాదు.
అమెరికాలో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ కాల్పుల ఘటన మరింత చర్చకు దారితీసింది. అధికార వర్గాలు పూర్తి దర్యాప్తు తర్వాతే స్పష్టమైన కారణాలు బయటపడతాయని చెబుతున్నాయి. కానీ ఈ సంఘటన ఒక విషయం స్పష్టం చేసింది. భద్రత బలంగా ఉందని భావించే వేదికలకూ కొత్త ముప్పులు దగ్గరలోనే ఉన్నాయనే హెచ్చరిక ఇది.
వైట్ హౌస్ విందులో కాల్పులు, ట్రంప్ సురక్షితమని ప్రకటన
13
Published on: 📅 26 Apr 2026, 08:58 AM
Reported by: 🖊
Eswar Pavan