ఇప్పటివరకు సురక్షితంగా ఉన్న ఇళ్లు ఒక్కసారిగా నిషేధిత జాబితాలో చేరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు వేలాది కుటుంబాలు అనుభవిస్తున్నాయి. రాష్ట్రంలో 22A జాబితా అప్డేట్ కారణంగా గృహ యజమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. హైకోర్టు ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూములకు సంబంధించిన సర్వే నంబర్లను గుర్తించి, భూభారతి మరియు రిజిస్ట్రేషన్ పోర్టళ్లలో నమోదు చేస్తోంది.
ఈ ప్రక్రియ ప్రధానంగా అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్లను అడ్డుకోవడానికే ప్రారంభించబడింది. అయితే అమలు దశలో అనుకోని సమస్యలు బయటపడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చెందిన కాలనీలు, బస్తీల్లోని ఇళ్ల సర్వే నంబర్లు కూడా 22A జాబితాలో చేరుతున్నాయి. దీంతో ఆ ఇళ్లపై కొనుగోలు, అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రస్తుతం నల్గొండ, యాదాద్రి, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై నిర్మించిన గృహాలు కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరడం ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. కాలక్రమంలో చేతులు మారిన ఇళ్ల యజమానులు ఇప్పుడు తమ ఆస్తి హక్కులు కోల్పోతామా అనే సందేహంతో ఉన్నారు.
ఇళ్లపై 22A నమోదు ప్రభావం కేవలం రిజిస్ట్రేషన్ సమస్యలకే పరిమితం కాదు. బ్యాంక్ లోన్స్, ఆస్తి బదిలీలు, వారసత్వ హక్కులు అన్నీ ప్రభావితం కావచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఇది పెద్ద ఆర్థిక, మానసిక ఒత్తిడిగా మారుతోంది.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు నిరసనలు చేపట్టారు. తమ ఇళ్లను నిషేధ జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ సమస్య పరిష్కారం లేకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం అర్హులైన గృహాలను గుర్తించి జాబితా నుంచి తొలగిస్తుందా? లేక మరింత స్పష్టత ఇస్తుందా? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.
ఇళ్లపై 22A షాక్..! వేల గృహాలు నిషేధ జాబితాలో – ప్రజల్లో ఆందోళన
11
Published on: 📅 01 Apr 2026, 10:54 AM
Reporter: 🖊 Kanakadri